

రైస్ పుల్లింగ్ పేరుతో పలువురిని బురిడీ కొట్టించి కోట్లరూపాయలు దండుకున్న సత్యసాయి జిల్లా తలుపుల మండలం వైసీపీ కన్వీనర్ కృష్ణారెడ్డి అలియాస్ డికె బాబును అరెస్ట్ చేసిన పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు . తన వద్ద మహిమ గల రాగి చెంబులు ఉన్నాయని, రాగి చెంబులు తయారుచేసి రెండింతల డబ్బులు సంపాదించిన బాధితులకు మాయమాటలు చెప్పి డబ్బులు దండుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది .
రాగి చెంబు మహిమగలదని నమ్మి డబ్బులు ఇచ్చి మోసపోయామని, తమ డబ్బు తమకు తిరిగి ఇవ్వమని అడిగినందుకు డికే.బాబు తనను చంపుతానని బెదిరిస్తున్నాడని బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు . డీకే బాబు వద్ద నుంచి ఒక ఫార్చునర్ వాహనం, ఐదు రాగి చెంబులు, మూడు సెల్ ఫోన్లు, లక్ష రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మాయ మాటలు చెప్పి మోసగించిన డీకే బాబుపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
