
.webp)
పొట్టకూటికోసం ఒంటరిగా పరాయి దేశం వెళ్ళాడు.. అనారోగ్య సమస్యలతో కాలం చేసాడు.. తమ ఇంటిపెద్ద చివరి చూపు కోసం ఆ కుటుంబం వెయ్యి కళ్ళతో ఎదురుచూసింది. ఆ సమస్య కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చెంతకు చేరింది. వెంటనే పని మొదలు పెట్టిన రామ్మోహన్ నాయుడు.. ఆ చివరి చూపును చేరువ చేశారు.. పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబానికి తోడ్పాటు అందిస్తానని హామీ ఇచ్చారు.
వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం జాడుపూడి గ్రామానికి చెందిన పిలక బాలకృష్ణ ఇరాక్ దేశం బాగ్దాద్ లో ప్రోక్లెయిన్ల మెకానిక్ గా పనికి కుదిరాడు.. గడచిన అయిదేళ్లుగా ఇదే వృత్తి చేసుకుంటూ.. అవకాశం వచ్చినప్పుడల్లా సొంతూరులోని భార్య, ఇద్దరు చిన్నారులను చూసుకుంటూ జీవనం గడుపుతోంది. అలాంటి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. కొద్ది నెలల క్రితం సొంత ఊరికి వచ్చిన పిలక బాలకృష్ణ.. ఈ జనవరి రెండవ తారీఖున తిరిగి బాగ్దాద్ పయనమయ్యాడు.
యధావిదిగా తన వృత్తిని చేసుకుంటూ గడుపుతున్న సమయంలో మెదడు సంబంధిత అనారోగ్య కారణాలతో ఈ నెల పదమూడవ తారీఖున మరణించారు. ఇరాక్ దేశంలోని బాగ్దాద్ లో తెలిసినవారేవ్వరూ తోడు లేకుండా బాలకృష్ణ ఒక్కరే ఉన్నారు.. అయన మృతి తరువాత ఆ దేహాన్ని చివరి చూపు చూసేందుకు ఆ కుటుంబం, ఆ గ్రామంలోని పెద్దలంతా తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇదే సందర్భంలో ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ ద్వారా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు దృష్టికి సమస్యను తీసుకెళ్లి.. పరిస్థితిని వివరించారు.
వెంటనే చర్యలు చేపట్టారు కేంద్ర మంత్రి. మన విదేశాంగ శాఖ అధికారులకు పరిస్థితి వివరించింది.. ఇరాక్ ఎంబాసితో సంప్రదింపులు ముమ్మరం చేశారు. దీంతో అక్కడి నుండి మృతదేహం బయలుదేరి శుక్రవారం నాడు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంది. అక్కడి నుండి సొంత ఊరు పంపించే బాధ్యతను సైతం రామ్మోహన్ నాయుడు తీసుకున్నారు. శనివారం రోజున జాడుపూడి గ్రామానికి బాలకృష్ణ మృతదేహం చేరుకోనుంది.
పెద్ద దిక్కును కోల్పోయిన ఆ కుటుంబానికి కూడా తోడ్పాటు అందిస్తానని రామ్మోహన్ నాయుడు చెప్పారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, స్థానికులు కేంద్రమంత్రి తీసుకున్న చొరవ పట్ల కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఒంటరిగా దేశం కానీ దేశంలో తమవాడు మరణిస్తే.. ఎటూ పాలుపోలేని స్థితిలో తనకు రామ్మోహన్ నాయుడు ఎంతో తోడ్పాటు అందించారని స్పష్టం చేశారు.
