
ఇటీవలికాలంలో పలు వేదికలపై సినీ ప్రముఖులు ఏదో ఒక అంశంపై వ్యాఖ్యలు చేయడం, అవి పెద్ద దుమారానికి దారి తీయడం చూస్తున్నాం. ఈ క్రమంలోనే హీరోయిన్ల దుస్తులపై నటుడు శివాజీ చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల జరిగిన దండోరా సినిమా వేడుకలో శివాజీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చిక్కులకు దారితీశాయి. మహిళల గౌరవానికి భంగం కలిగించేలా ప్రసంగించారన్న ఆరోపణలపై తెలంగాణ రాష్ట్ర మహిళా కమీషన్ తీవ్రంగా స్పందించింది. దీనిని సుమోటోగా స్వీకరించింది. ప్రాథమిక విచారణ అనంతరం, ఆయన ప్రసంగంలో మహిళల పట్ల అవమానకర ధోరణి ఉందని కమీషన్ నిర్ధారించింది.
కేవలం నోటీసులతోనే సరిపెట్టకుండా, ఈ వ్యవహారాన్ని లోతుగా విచారించాలని కమీషన్ నిర్ణయించింది. అంతేకాదు, ఇకపై ఇలాంటి వ్యాఖ్యలు ఎవరూ చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే నటుడు శివాజీకి అధికారికంగా నోటీసులు జారీ అయ్యాయి. మహిళా కమిషన్ జారీ చేసిన ప్రకారం డిసెంబర్ 27వ తేదీ ఉదయం 11:00 గంటలకు హైదరాబాద్లోని భవన్లో ఉన్న మహిళా కమీషన్ శివాజీ స్వయంగా కమీషన్ ఎదుట హాజరై తన వివరణ ఇచ్చుకోవాలని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే ఈ అంశం మీద ఇప్పటికే శివాజీ క్షమాపణలు చెబుతూ వీడియో రిలీజ్ చేశారు. అయితే మహిళా కమిషన్ ఇచ్చిన నోటీసుల ప్రకారం 27న శివాజీ వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.
